HeadLines

'జై లవకుశ' కోసం.. పూరీ కథ చోరీ జరిగిందా..?


ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న 'జై లవకుశ' టీజర్ రీసెంట్ గా రిలీజైన విషయం తెలిసిందే. ఈ టీజర్ లో 'జై'గా నెగటివ్ రోల్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసి.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే.. ఇదే టీజర్ పూరి జగన్నాథ్‌ను మాత్రం అప్సెట్ చేసిందట. ఇందుకు కారణం ఎన్టీఆర్ నెగటివ్ రోల్‌లో నటించడమేనట.


'టెంపర్' సినిమాలో నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ను చూపించిన పూరి.. గత డిసెంబర్ లో ఎన్టీఆర్ తో మరో సినిమా చేయాలనుకుని ఓ స్టోరీ కూడా వినిపించాడు. అయితే.. ఎన్టీఆర్ కొన్ని మార్పులు కోరడం.. అందుకు పూరి అయిష్టత చూపడంతో ఆ స్టోరీ పక్కనపెట్టేశారు. కానీ రీసెంట్ గా విడుదలైన టీజర్ లోని 'జై' క్యారెక్టర్.. పూరి వినిపించిన స్టోరీలోని నెగటివ్ రోల్ కు దగ్గరగా ఉందట. 'జై' పాత్రను మలచిన తీరు చూశాక.. తన ఐడియా లీక్ అయినట్టుగా భావించిన పూరి.. ఈ విషయాన్ని ఇటీవల 'పైసా వసూల్' సెట్ లో తన సన్నిహితులతో చర్చించినట్టు ఇటీవల ఓ ఇంగ్లీష్ డైలీలో ప్రచురితమైంది.

పూరి ఐడియాను కాపీ కొట్టారనే వార్తలను.. తాజాగా ‘జై లవకుశ’ దర్శకుడు బాబి ఖండించాడు. ఎన్టీఆర్ తో ఎవరైనా ఇలాంటి క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడి ఉండచ్చేమో కానీ.. తాను మాత్రం తన స్క్రిప్ట్ ప్రకారమే సినిమా చేస్తున్నానని.. దీనిపై తానేమి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. సినిమానే ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందని పేర్కొన్నాడు. మరి.. కాపీ జరిగిందో లేదో తెలుసుకునేందుకు సెప్టెంబర్-21 వరకూ పూరి ఆగుతాడా..!