HeadLines

మరోసారి మణిరత్నం చిత్రంలో జ్యోతిక


మణిరత్నం వంటి క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో నటించాలని చాలామంది నటీనటులు కోరుకుంటారు. జ్యోతిక కూడా ఒకప్పుడు ఇలాగే కోరుకుందట. కాకపోతే.. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరబోతోంది. రెండేళ్ల క్రితం '36 వయదినిలే' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక.. ఇప్పుడుమణిరత్నం దర్శకత్వలో నటించబోతోంది. ఈ చిత్రంలో జ్యోతికతో పాటు విజయ్ సేతుపతి, ఐశ్వర్యా రాజేశ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

మణిరత్నంతో కలసి వర్క్ చేయడం జ్యోతికకు ఇదేం కొత్త కాదు. గతంలో 'డుం డుం డుం' అనే సినిమాకు ఈ ఇద్దరు కలసి వర్క్ చేశారు. కాకపోతే.. ఆ మూవీకి మణిరత్నం నిర్మాత మాత్రమే. దీంతో.. తొలిసారి మణిరత్నం దర్శకత్వంలో నటించబోతోంది జ్యోతిక. ఇక జ్యోతిక భర్త సూర్య.. చాన్నాళ్లక్రితమే మణిరత్నం డైరెక్షన్ లో 'యువ' చిత్రంలో నటించాడు.

ప్రస్తుతం జ్యోతిక మరో రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి బాల దర్శకత్వంలో జీవీ ప్రకాశ్ తో కలసి నటిస్తోన్న 'నాచియర్' కాగా.. మరొకటి సూర్య నిర్మిస్తున్న 'మగలిర్ మట్టుమ్' చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తానికి ఓ సినిమా పూర్తవక ముందే మరో సినిమాకు కమిట్ అవుతూ రీఎంట్రీలోనూ బిజీ అవుతోంది జ్యోతిక.